ఎయిర్‌టెల్‌ 4జీ హాట్‌స్పాట్‌ ధర తగ్గింది

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన 4జీ హాట్‌స్పాట్‌ పోర్టబుల్‌ వై-ఫై డివైజ్‌ ధర తగ్గించింది. ఈ హాట్‌స్పాట్‌ను రూ.999కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఎక్కువ మంది కస్టమర్లను తన నెట్‌వర్క్‌ పరిధిలోకి తెచ్చుకునేందుకు ఎయిర్‌టెల్‌ ఈ డివైజ్‌ ధర తగ్గించింది. ఎయిర్‌టెల్‌ 4జీ హాట్‌స్పాట్‌, మల్టిపుల్‌ డివైజ్‌లకు కనెక్ట్‌ చేసుకునే సౌకర్యాన్ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టాబ్లెట్లు, స్మార్ట్‌టీవీల వరకు దీన్ని కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇది రిలయన్స్‌ జియో అందిస్తున్న జియోఫై ఎం2ఎస్‌ 4జీ హాట్‌స్పాట్‌కు గట్టి పోటీగా ఉంది. ధర తగ్గించక ముందు ఎయిర్‌టెల్‌ 4జీ హాట్‌స్పాట్‌ రూ.1500కి అందుబాటులో ఉండేది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దిగ్గజ ఎయిర్‌టెల్‌ రిటైల్‌ స్టోర్లలో తమ పోర్టబుల్‌ ఇంటర్నెట్‌ డివైజ్‌ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 
అమెజాన్‌ ఇండియా నుంచి కూడా కస్టమర్లు దీన్ని త్వరలోనే ఆర్డర్‌ చేసుకోవచ్చని పేర్కొంది. రిలయన్స్‌ జియో తన జియోఫై ఎం2ఎస్పై ధర తగ్గించిన తర్వాత మూడు నెలల వ్యవధిలోనే ఎయిర్‌టెల్‌ కూడా తన పోర్టబుల్‌ డివైజ్‌ను తగ్గింపు ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ డివైజ్‌ పనిచేయడానికి ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డు కావాల్సి ఉంటుంది. మొబైల్‌ ఫోన్లలో సిమ్‌ కార్డుకు రీఛార్జ్‌ చేసిన మాదిరిగా దీనికి కూడా రీఛార్జ్‌ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎయిర్‌టెల్‌ 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోతే, ఈ హాట్‌స్పాట్‌ 3జీ నెట్‌వర్క్‌లోకి మారిపోతుంది. ఒకేసారి 10 డివైజ్‌ల వరకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఆరు గంటల వరకు దీన్ని బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది.

No comments

Powered by Blogger.